జ్యోతిరావ్‌ పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి : కలెక్టర్‌ మాధవీ లత

Nov 28,2023 14:48 #East Godavari

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌: బడుగు వర్గాల ఆశా జ్యోతి, సమాజాభివృద్ధికి ఆద్యుడు అయిన జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డా.కే.మాధవీలత పిలుపునిచ్చారు. మంగళవారం జ్యోతిబా పూలే 133వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్‌ మాధవీలత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జేసీ తేజ్‌ భరత్‌లు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ కే.మాధవీలత మాట్లాడుతూ.. మహిళల, దళితుల, అట్టడుగు వర్గాల వారి స్థితి గతులను మార్చాలని భావించిన పూలే భార్యా భర్తలు కలసి చదువుకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చారని అన్నారు. తొలుత తన కుటుంబ సభ్యులకే చదువు చెప్పి తదుపరి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మహిళల విద్యను ప్రోత్సహించరాన్నారు. తద్వారా మహిళా సాధికారతకు ఆనాడే తొలి అడుగు వేసారని తెలిపారు. సమాజంలో ఎంతో మార్పు జరిగినప్పటికీ ఇంకను ఎంతో సాధించవలసి ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ దిశలో జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన జరుగుతోందని తెలిపారు. జ్యోతిరావ్‌ ఫూలే, వారి సతీమణి సావిత్రీ బాయి ఫూలే మహిళా విద్యాభ్యాసం కోసం కృషి చేస్తూ సామాజిక మార్పుకు ఆనాడే శ్రీకారం చుట్టారని తెలిపారు.ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జ్యోతిరావ్‌ పూలే, వారి సతీమణి భౌతికంగా లేనప్పటికీ వారి ఆశయాలకు , ఆలోచనలకూ ప్రతిరూపంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నిదర్శనంగా ఉన్నాయని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు జగనన్న ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందన్నారు. వెనుకబడిన వర్గాల వారంతా అభివృద్ధి చెందాలని ఫూలే ఆనాడే భావించారని, వారి ఆశయాల మేరకు నేడు క్షేత్ర స్థాయిలో బిసిలను అభివృద్ధి చేయడానికి ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాటు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌. తేజ్‌ భరత్‌, బిసీ సంక్షేమ అధికారి పి. రమేష్‌, కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️