15, 16, 17 తేదీల్లో ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు

Nov 27,2023 13:32 #AIKS, #meeting
aiks council meeting on dec

జయప్రదం చేయండి : ఆహ్వాన సంఘం

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో కర్నూలులో నిర్వహించే ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కర్నూలు కార్మిక, కర్షక భవన్ లో సోమవారం ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల వాల్ పోస్టర్ ను, ఆహ్వాన సంఘం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి. తిక్కా రెడ్డి మాట్లాడుతూ సమావేశాలను జయప్రదం చేయాల్సిన బాధ్యత కర్నూలు జిల్లా వాసులందరి మీదా ఉందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులు హాజరు కానున్నారన్నారు. కర్నూలు జిల్లాకు కరువు జిల్లాగా ప్రకటించుకునేందుకు ఈ సమావేశాలు తోడ్పడతాయని అన్నారు. రైతాంగ సమస్యలను ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. రైతులకు వనరులు కల్పించే స్థితిలో రాజకీయ పార్టీలు లేవని, ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. వ్యవసాయానికి నీళ్లు లేని పరిస్థితి నెలకొందన్నారు. రైతాంగానికి ప్రభుత్వం ఏ మాత్రం సాయం చేయడం లేదన్నారు. 20 ఎకరాలున్న రైతులు కూడా వలస పోతున్నారని, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. భారత్ ఆగ్రోస్ అధినేత వాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అనేది మాటల వరకే వింటున్నామన్నారు. రైతు సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతుంటే వ్యవసాయ పనిముట్ల పరిశ్రమలు కూడా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. సంక్షోభం నుంచి రైతులను సంక్షేమం వైపు తీసుకొచ్చేందుకు ఈ సమావేశాలు తోడ్పడతాయన్నారు. సమావేశాలను కర్నూలులో నిర్వహించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నామన్నారు. రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ జి.పుల్లయ్య మాట్లాడుతూ 90 శాతం నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి నిరుపయోగంగా మారిపోతోందన్నారు. ప్రభుత్వాలు చెబుతున్నవి మాటలకే పరిమితం అవుతున్నాయన్నారు. ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతులకు ఏం కావాలని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఏపీ కూడా రాయస్థాన్ల ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. లక్షలు ఎగ్గొట్టే బడా బాబులను వదిలేసి లక్షల అప్పు తీసుకున్న రైతులను పట్టిపీడిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఏఐకేఎస్ సమావేశాలు కీలకంగా మారనున్నాయన్నారు. మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ ఎన్.శమంతకమణి మాట్లాడుతూ రైతులు వారి సమస్యల గురించి ఈ సమావేశాల్లో నాయకులకు తెలియపరచాలన్నారు. ఎరువులు విత్తనాలు కల్తీ అయిపోతున్నాయని, వాటిని కొని రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఏడాది వర్షాలు లేక పంటలు పండక కరువుతాండవించిందని, రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇవ్వాలన్నారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి, ఏపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా 15న కర్నూలు పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభలో కేరళ ఆర్థిక శాఖ మంత్రి కె.బాల గోపాల్, ఎఐకెఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ దావలే, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, ఉపాధ్యక్షులు హన్నన్ మొల్ల హాజరవుతారని తెలిపారు. అలాగే 3న వ్యవసాయ రంగ సంక్షోభం, 10న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘం సభ్యులు పి.నిర్మల, డి.గౌస్ దేశాయ్, కెవి.నారాయణ, పిఎస్.రాధాకృష్ణ, బి.రామాంజనేయులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️