నండూరి ప్రసాదరావు వర్ధంతి సందర్భంగా సిపిఎం నివాళి

Nov 29,2023 15:21 #Kakinada
cpm remember nanduri prasadarao

ప్రజాశక్తి-కాకినాడ : కార్మికోద్యమ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలి కామ్రేడ్ నండూరి ప్రసాదరావు 22 వ వర్ధంతి సందర్భంగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య భవన్ లో ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, నగర సీనియర్ నాయకులు కె.సత్తిరాజులు నండూరి ప్రసాదరావు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా రాజశేఖర్, సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీలు మాట్లాడుతూ ముఖాసా జమీందారీ కుటుంబంలో జన్మించిన నండూరి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారని తెలిపారు. అనేక అంశాలపై లోతైన అవగాహన కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి నండూరి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తికాలం కార్యకర్త గా చరిత్ర లో నిలిచారని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కృషి చేసారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలకు నాయకత్వం వహించడమే కాకుండా సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గా రాష్ట్రంలో కార్మికోద్యమ నిర్మాణానికి కృషి చేసారన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడుగా, రాజ్యసభ సభ్యుడుగా ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు. ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారని, అత్యంత నిరాడంబరంగా జీవించారన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి సంబంధించి ఆయన గ్రంథాలు రాసారన్నారు. మతోన్మాదం వెర్రితలలు వేస్తున్న నేటి తరుణంలో నండూరి వంటి మహనీయుల స్ఫూర్తితో నేటితరం సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని సిపిఎం పిలుపు ఇస్తోందన్నారు. కె. సత్తిరాజు, వి. సుబ్బరాజు లు మాట్లాడుతూ నండూరితో అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కె. వీరబాబు, దుంపల ప్రసాద్, మలక వెంకట రమణ, రాణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️