27, 28లలో విజయవాడలో మహధర్నా

Nov 22,2023 16:25 #Guntur District

ప్రజాశక్తి-మంగళగిరి(గుంటూరు) : కేంద్ర బిజెపి ప్రభుత్వ కర్షక, కార్మిక, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీలలో విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు పిలుపునిచ్చారు. మంగళగిరి రైతు సంఘం కార్యాలయంలో బుధవారం రైతు సంఘం విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జొన్న మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర ప్రభుత్వ రంగ పంటల భీమా సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. కిసాన్ పోరాటం సందర్భంగా అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని అన్నారు. పెండింగులో ఉన్న కేసులన్నిటిని ఉపసంహరించుకోవాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించి పునరావసం కల్పించాలని కోరారు. రైతుల పంట రుణాల బకాయిలను రద్దు చేయాలని అన్నారు. కేరళ తరహా రైతు రుణ ఉపశమన చట్టమును పార్లమెంట్లో ఆమోదించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని అన్నారు. మహా ధర్నాకు మంగళగిరి ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు వి భారతి, జి నాగేశ్వరావు, బి జానారెడ్డి, ఏ సాంబిరెడ్డి, గోపాల్ రెడ్డి, ఏ ప్రకాష్ రావు, ఎస్ రామిరెడ్డి, బి సత్యమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️