బనగానపల్లె రూపురేఖలు మారుస్తాం : మంత్రి బీసీ

Sep 9,2024 21:05

పట్టణంలో రోడ్లను పరిశీలిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

బనగానపల్లె రూపురేఖలు మారుస్తాం : మంత్రి బీసీ
ప్రజాశక్తి – బనగానపల్లె
బనగానపల్లె పట్టణం రూపురేఖలు మారుస్తామని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆస్థానం రోడ్డు, పెట్రోల్‌ బంకు కూడలి, కేడీసీసీ బ్యాంకు, పాత రైస్‌మిల్‌ ఏరియాలలో మంత్రి పర్యటించి సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో వైసిపి ఐదు సంవత్సరాల పాలనలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారాయన్నారు. ఈ ప్రాంతాన్ని రెండు విధాలుగా విభజించి డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. పాత ఆంధ్ర బ్యాంకు ఏరియాలో పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం సమీపంలో రూ.35 లక్షలతో డ్రైనేజీ కాలువలన ఏర్పాటు చేసి నీటిని మళ్లించనున్నట్లు చెప్పారు. వర్షాలు తగ్గిన వెంటనే డ్రైనేజీ కాలువల పనులు ప్రారంభిస్తామన్నారు. పెట్రోల్‌ బంక్‌ సమీపంలో పూల అంగళ్ళ వద్ద డ్రైనేజీ కాలువలు బ్లాక్‌ అవుతున్నాయని, ప్రతిపాదనలు పంపి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కెడిసిసి బ్యాంకు పక్కన సిసి రోడ్డు అక్రమణలను తొలగించాలని, పాత రైస్‌ మిల్లు సమీపంలో రోడ్డుకు అడ్డంగా గోడలను కట్టి వైసిపి నాయకులు ఆక్రమణలు చేశారని, వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డిఇ నాగ శ్రీనివాసులు, టిడిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు కృష్ణా నాయక్‌, పట్టణ ఉపసర్పంచి బురానుద్దీన్‌, యాగంటి పల్లె ఉప సర్పంచి బండి మౌళేశ్వరరెడ్డి, టిడిపి నాయకులు రాయలసీమ సలాం, టిప్‌టాప్‌ కలాం, సయ్యద్‌ హుస్సేన్‌ నియాజీ, అల్తా హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️